మహిళ మెడలో నుండి ఐదు తులాల బంగారు గొలుసు అపహరణ
భయాందోళనలకు గురవుతున్న స్థానికులు
ఓరుగల్లు9 నేషనల్ టీవీ నిర్మల్ జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 2 :
నిర్మల్ జిల్లా బైంసా లో చైన్ స్నాచర్లు మళ్లీ రెచ్చిపోయారు. ఓ మహిళ మెడలో నుండి ఐదు తులాల బంగారు గొలుసు అపహరించి పారిపోయారు. స్థానికులు, బాధితురాలు తెలిపిన వివరాల మేరకు బైంసా పట్టణంలోని రావు నగర్ వద్ద గంగాదేవి అనే వృద్ధురాలు అటువైపుగా వెళుతుండగా నంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనంలో ఇద్దరు దొంగలు అటువైపుగా వెళ్తూ మెడలో నుండి ఐదు తులాల బంగారు గొలుసు దొంగలించి పారిపోయారు. దీంతో మహిళకు స్వల్ప గాయాలు అయ్యాయి. వెంటనే వృద్ధురాలు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కాగా వరుస ఘటనలతో జిల్లాలో మహిళలు ఒంటరిగా వెళ్లడానికి భయపడుతున్నారు. దుండగులు నంబర్ ప్లేట్ లేని బైకుల మీద వస్తూ వరుసగా చైన్ స్నాచింగ్లకు పాల్పడుతూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. గత రెండు నెలలలో ఆరు చైన్ స్నాచింగ్లు కాగా, వారం రోజుల వ్యవధిలో రెండు ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇన్ని దొంగతనాలు జరుగుతున్న జిల్లా పోలీసులు దొంగలను పట్టుకోవడంలో విఫలమవుతున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు. ఇకనైనా జిల్లా పోలీస్ అధికారులు స్పందించి చైన్ స్నాచింగ్లు అరికట్టాలని కోరుతున్నారు.