కుంటాల రైస్ మిల్ వద్ద ధాన్యం తిరుగుపయనం
ఓరుగల్లు9 నేషనల్ టివి నిర్మల్ జిల్లా ప్రతినిధి, మే 29 :
నర్సాపూర్ (జి): పిఏసిఎస్ సెంటర్ల నిర్లక్ష్యం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ధాన్యం కొనుగోళ్లలో అధికారుల సమన్వయ లోపం కారణంగా రైతులు పండించిన పంటను అమ్ముకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. దొంగుర్గం పిఏసిఎస్ సెంటర్ నుంచి కుంటాలలోని ఒక రైస్ మిల్లుకు పంపిన వరి ధాన్యానికి సంబంధించిన ట్రక్ షీట్ లో లోపాలు ఉండటంతో నాలుగు రోజులుగా ధాన్యం అక్కడే నిలిచిపోయింది. నేడు (గురువారం) సదరు ధాన్యాన్ని తిరిగి పంపడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సాధారణంగా, పిఏసిఎస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, సివిల్ సప్లై అధికారులు సమన్వయంతో రైతుల వద్ద నుండి వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తారు. ధాన్యం తూకం వేయగానే, ఆ బస్తాలను రవాణా చేసే లారీ నెంబరు, డ్రైవర్ వివరాలు, రైస్ మిల్ పేరు, ఎన్ని బస్తాలు పంపుతున్నారు వంటి పూర్తి వివరాలను అధికారులు ధ్రువీకరించి ట్రాక్ షీట్ ను రైస్ మిల్ కు పంపాలి. ఈ ట్రాక్ షీట్ ఆధారంగానే రైస్ మిల్లులు ధాన్యాన్ని అన్లోడ్ చేసుకుని రైతులకు సకాలంలో డబ్బులు చెల్లిస్తాయి.
అయితే, దొంగుర్గం పిఏసిఎస్ సెంటర్ నుండి పంపిన వరి ధాన్యానికి సంబంధించిన ట్రక్ షీట్ లో రైస్ మిల్ పేరు లేకపోవడం, ఎన్ని వడ్ల ధాన్యం సంచులు పంపిస్తున్నారో అనే వివరాలు లేకపోవడం గందరగోళానికి దారితీసింది. ఈ లోపాల కారణంగా, రైతులు నాలుగు రోజుల నుండి కుంటాల రైస్ మిల్లు వద్ద తమ ధాన్యాన్ని అన్లోడ్ చేయించుకోలేక రైతుల ఇబ్బందులు పడ్డారు. ధాన్యం నిలిచిపోవడంతో కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు నిరీక్షణ తప్పడం లేదు.
ఈరోజు, ట్రక్ షీట్ లోని లోపాలను కారణంగా చూపిస్తూ రైస్ మిల్లు సదరు ధాన్యాన్ని తిరిగి పంపింది. దీంతో రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల రైతులు తమ పండించిన పంటను అమ్ముకోవడానికి అనేక అడ్డంకులు ఎదుర్కొంటున్నారని, దీనిపై ప్రభుత్వం తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.



రైస్ మిల్ నుంచి వడ్లను ట్రాక్టర్లు తిరిగి పంపించిన రైస్ మిల్లర్లు