ఓరుగల్లు9నేషనల్ టీవీ :జిల్లాల్లో డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ (డీఆర్సీ) మీటింగ్స్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ హయాంలో జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశాలు నిర్వహించగా, ప్రత్యేక రాష్ట్రంలో గత బీఆర్ఎస్ సర్కార్ పదేండ్ల పాటు వాటిని పక్కనపెట్టింది. ఇప్పుడు వాటిని పునరుద్ధరించాలని ప్రభుత్వం భావిస్తున్నది. ప్రస్తుతానికి 10 ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన డీఆర్సీ మీటింగ్స్ నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది. దీనికి సంబంధించిన విధివిధానాలను త్వరలోనే విడుదల చేయనున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. గతంలో డీఆర్సీ మీటింగులకు మినీ అసెంబ్లీ సమావేశాలుగా గుర్తింపు ఉండేది.
జిల్లా పరిషత్ సమావేశాల్లో, ఎమ్మెల్యే స్థాయిలో పరిష్కారం కాని ప్రధాన సమస్యలు, వివిధ కారణాలతో పెండింగ్లో ఉన్న పనులు, కావాల్సిన నిధులపై ఇన్చార్జ్ మంత్రుల సమక్షంలో సమగ్రంగా చర్చించి సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడమే డీఆర్సీ మీటింగ్స్ అసలు లక్ష్యం. జిల్లా ఇన్చార్జి మంత్రి అధ్యక్షతన ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారుల సమక్షంలో డీఆర్సీ మీటింగ్స్ జరుగుతాయి. ఇందులో విద్య, వైద్యం, వ్యవసాయం, సాగు, తాగు నీరు, రోడ్లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమం వంటి ప్రధాన సమస్యలపై చర్చించి పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది. కలెక్టర్ల స్థాయిలో పరిష్కారం కాని సమస్యలను ఇన్చార్జి మంత్రి నోట్చేసుకుని సీఎం అధ్యక్షతన జరిగే కేబినెట్మీటింగ్స్ లో చర్చించి పరిష్కరించే వీలుకలుగుతుంది. ఇప్పటికే సీఎం రేవంత్రెడ్డి ఉమ్మడి జిల్లాల వారీగా ఇన్చార్జ్ మంత్రులను నియమించారు.