జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా : జిల్లాలో రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా నిలువ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ బిఎం. సంతోష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ గద్వాలలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏఈఓల నుంచి అనుమతి పొందిన రైతులకు నిబంధనల ప్రకారం ఏ మేరకు విత్తనాలు, ఎరువులు సబ్సిడీకి విక్రయిస్తారని అడిగి తెలుసుకున్నారు. ప్రైవేటు డీలర్ల వద్ద రైతులు అధిక ధరలకు కొనుగోలు చేసే పరిస్థితి రాకుండా చూడాలన్నారు. గద్వాల పిఎసిఎస్ కార్యదర్శి వెంకటేశ్వర రెడ్డి స్పందిస్తూ తెలంగాణ రాష్ట్ర సీడ్స్, నేషనల్ సీడ్స్ కార్పొరేషన్, హాకా ద్వారా కావాల్సిన విత్తనాలు, ఎరువులు తెప్పిస్తున్నట్లు చెప్పారు. మరో15 రోజుల్లో రైతుల నుంచి ఎక్కువగా ప్యాడి విత్తనాల డిమాండ్ ఉంటుందని, ఇందుకనుగుణంగా స్టాక్ తెప్పిస్తామని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ గద్వాల పాత బస్టాండులోని ఒక సీడ్స్, పెస్టిసైడ్స్ దుకాణంలో అమ్ముతున్న విత్తనాలు, ఎరువులను తనిఖీ చేశారు. స్టాక్, ఇన్ వాయిస్ రిజిస్టర్లను, రైతులకు ఇచ్చే బిల్లులను, దుకాణం లైసెన్స్ ను క్షుణ్ణంగా పరిశీలించారు. స్టాక్ బోర్డులోని వివరాలను దుకాణంలో ఉన్న స్టాక్ తో సరిపోతుందా లేదా తరచూ తనిఖీ చేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. రైతులు ఎక్కువగా ఏ రకం విత్తనాలను కొనుగోలు చేస్తారని దుకాణం యజమానిని అడిగారు. వివిధ విత్తన ప్యాకెట్లపై నిబంధనల ప్రకారం అన్ని వివరాలు నమోదు చేశారో, లేదో పరిశీలించారు. నకిలీ విత్తనాల కారణంగా రైతులు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత అధికారులే కాక డీలర్లపై కూడా ఉందని తెలిపారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ అధికారి గోవిందు నాయక్, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు సంగీత లక్ష్మి తదితరులు ఉన్నారు.
రైతులకు విత్తనాల కొరత లేకుండా చూడాలి-జిల్లా కలెక్టర్ బీఎం. సంతోష్ ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES