జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి : – పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా నాగర్ కర్నూల్ సెగ్మెంట్లోని జోగులాంబ గద్వాల జిల్లాలో సోమవారం జరిగిన పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. ఎన్నికల్లో అతి ముఖ్యమైన పోలింగ్ ప్రక్రియ నిర్వహణకుగానూ జిల్లా ఎన్నికల అధికారులు మొత్తం 594పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసి గద్వాలలో 34 సెగ్మెంట్లలో, అలంపూర్ 31 సెగ్మెంట్లలో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉదయం 7నుంచి సాయంత్రం 6గంటల వరకు జరిగిన ఎన్నికల పోలింగులో అక్కడక్కడ కొన్ని గ్రామాల్లో ఈవీయంలు మొరాయించినప్పటికీ అధికారులు వెంటనే సరి చేసి పోలింగ్ ప్రక్రియను సజావుగా జరిగేలా చర్యలు తీసుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకు గద్వాల అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 72.71శాతం, అలంపూర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో 71శాతం పోలింగ్ జరిగినట్లు చెప్పారు. సాయంత్రం 6:00 గంటలలోపు పోలింగ్ కేంద్రంలో వరుసలో ఉన్నవారందరు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉన్నందున మొత్తం పోలింగ్ శాతం గద్వాల నియోజకవర్గంలో 74.93శాతం, అలంపూర్ నియోజకవర్గంలో 73.11శాతం పోలింగ్ జరిగినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బీఎం. సంతోష్ తెలిపారు. పోలింగుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎన్నికల అధికారులు, సిబ్బంది ఉదయం నుంచి తమ విధులను పకడ్బందీగా నిర్వహించారని తెలిపారు.
*ఓటు హక్కును వినియోగించుకున్న ప్రముఖులు*…
జిల్లాలోని గద్వాల, అలంపూర్ నియోజకవర్గాల్లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఆయా పార్టీల ఇన్ఛార్జిలు, నాయకులు వారి వారి స్వగ్రామాల్లో తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ధరూర్ మండలంలోని బూరెడ్డిపల్లి గ్రామంలో తన సతీమణి బండ్ల జ్యోతితో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం గద్వాల నియోజకవర్గంలోని గట్టు, కేటీదొడ్డి, మల్దకల్, గద్వాల పట్టణంలోని పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ జరుగుతున్న తీరును పరిశీలించారు. అలాగే జిల్లా పరిషత్ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జి సరిత తిరుపతయ్యలు అలంపూర్ నియోజకవర్గంలోని మానవపాడు మండలంలోని జల్లాపురం గ్రామంలో కుటుంబ సభ్యులతో కలిసి తమ ఓటు హక్కును వినియోగించుకుని గద్వాల పట్టణంతోపాటు, నియోజకవర్గంలోని అన్ని మండలాలను సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు. బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి డీకే. స్నిగ్ద రెడ్డి గద్వాల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే మున్సిపల్ చైర్మన్ బీఎస్. కేశవ్ గద్వాల పట్టణంలోని బుర్దపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఓటు వేశారు. అలాగే గద్వాల మార్కెట్ మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బండ్ల లక్ష్మీ దేవమ్మ, బండ్ల చంద్రశేఖర్ రెడ్డి, రమ్య ఇండస్ట్రీస్ అధినేత బండ్ల రాజశేఖర్ రెడ్డి దంపతులు బూరెడ్డిపల్లిలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదే విధంగా ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామి రెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు పుల్లూరు గ్రామంలో తమ ఓటు హక్కును వినియోగించుకోగా, కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ కుమార్ అయిజ మండలంలోని చిన్నతాండ్రపాడు గ్రామంలో, బీఆర్ఎస్ పార్టీ నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ అలంపూర్ పట్టణంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే వివిధ పార్టీల నాయకులు, రెండు నియోజకవర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు చేరుకొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లాలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా జిల్లా ఎస్పీ రితిరాజ్ పర్యవేక్షణలో పోలీసులు గట్టి బందోబస్తు నిర్వహించారు.