జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న ఓ అధికారి జిల్లాలో ఇంచార్జి బాధ్యతలు నిర్వహిస్తుండడంతో జిల్లాకు ఎప్పుడు వస్తున్నారో…ఎప్పుడు వెళ్తున్నారో ఎవరికీ అంతుచిక్కడం లేదు. ఈ అధికారి కార్యాలయం గతంలో జిల్లా కేంద్రంలోని ఓ అద్దె భవనంలో కొనసాగుతుండగా, ప్రస్తుతం జిల్లా సమీకృత కార్యాలయ భవనంలో ఏర్పాటు చేసినట్లు కార్యాలయంలో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగి చెపుతున్నారు. కానీ సమీకృత కార్యాలయ భవనంలో ఎక్కడ వెదికినా ఆ కార్యాలయం మాత్రం కనిపించడం లేదు… కానీ గతంలో ఉన్న అద్దె భవనం వద్దే కార్యాలయం బోర్డును ఉంచి ప్రజలను కలెక్టరేటు చుట్టూ తిప్పుతూ అయోమయానికి గురి చేస్తున్నారు. అయితే డ్రగ్ ఇన్స్పెక్టర్ మాత్రం ప్రతి వారంలో ఒకటి, రెండు రోజులు వస్తున్నారని సమాచారం ఉన్నా వారు కనీసం ఎలా ఉంటారో చూద్దామన్నా కనిపించడం లేదు. కలెక్టర్ కార్యాలయంలోనూ ఏ రోజు కనిపించరు…కానీ జిల్లాలోని మెడికల్ షాపులపై మాత్రం జరగాల్సిన దాడులు జరుగుతున్నాయని…వారికి అందాల్సిన తాయిలాలు అందుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఓ జిల్లా అధికారి అయివుండి వారు జిల్లాకు వచ్చి వెళ్లే సమాచారం ఎవరికీ తెలియనివ్వకుండా ఉండడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అధికారి ఇలా వచ్చి అలా వెళ్తుండడంతో జిల్లాలోని మెడికల్ మాఫియా సైతం ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలో మెడికల్ కి సంబంధించిన సమాచారం అడిగేందుకు ప్రయత్నిస్తే ఇటు ఫోన్లోనూ అందుబాటులోకి రాక, అటు కార్యాలయంలోనూ అందుబాటులో ఉండడం లేదు. అధికారి కోసం, కార్యాలయం కోసం ఔట్ సోర్సింగ్ ఉద్యోగికి ఫోన్ చేస్తే మాత్రం కలెక్టర్ కార్యాలయంలోనే ఉందని సమాధానం ఇస్తున్నారే కానీ ఎక్కడ అనే విషయాన్ని స్పష్టంగా చెప్పకుండా ఆ ఉద్యోగి సైతం కనిపించకుండా ప్రజలను, మీడియాను కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిప్పుతూ అయోమయానికి గురి చేస్తున్నారు. అయితే ఆ అధికారికి జిల్లాలోని మెడికల్ ఏజెన్సీలు, షాపుల నుంచి అందాల్సిన ముడుపులు మాత్రం గుట్టుచప్పుడు కాకుండా అందుతున్నాయని, ఏవైనా లెసైన్స్ కి సంబంధించి, ఇతర ఫైల్స్ పై సంతకం అవసరం అయితే వారిని మహబూబ్ నగర్ కి రప్పించుకుంటున్నట్లు తెలిసింది. దీనికి జిల్లాలో ఎవరు సూత్రధారులుగా వ్యవహరిస్తున్నారన్న సందేహాలు ప్రజల నుంచి వ్యక్తం అవుతున్నాయి. కాగా ఈ అధికారి జిల్లాకు వచ్చి వెళ్లే విషయం ఎవరికీ చెప్పొద్దని కార్యాలయంలో పని చేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగికి ఆంక్షలు విధించారని తెలిసింది. దీనిపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
జిల్లా డ్రగ్ ఇన్స్పెక్టర్ ఆచూకీ ఎక్కడ…?-కార్యాలయం బోర్డు ఒక చోట ఉంచి…ప్రజలను అయోమయానికి గురి చేస్తున్న కార్యాలయ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి-అధికారిని ఫోన్లో సంప్రదిద్దామన్న స్పందించకపోవడం వెనుక ఉన్న ఆంతర్యమేమి…! ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES