ఓరుగల్లు9నేషనల్ టీవీ :దేశంలోనే గొప్ప చారిత్రక నగరంగా అభివృద్ధి చెందాల్సిన ఓరుగల్లు పదేండ్ల కేసీఆర్ పాలనలో మసక బారింది. వరంగల్ను రెండో రాజధాని చేస్తాం. ఓఆర్ఆర్, ఎయిర్ పోర్టు, టెక్స్ టైల్ పార్క్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ తీసుకొచ్చి నగరాన్ని డెవలప్ చేసే బాధ్యత నాదే’నని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఓరుగల్లు నగరానికి గొప్ప కీర్తి ప్రతిష్టలు తెచ్చేలా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్యకు మద్దతుగా మంగళవారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి హనుమకొండ, వరంగల్ సిటీలో రోడ్డు షో నిర్వహించారు. ఈ సందర్భంగా కార్నర్ మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ తెలంగాణకు రెండో రాజధానిగా వరంగల్ ను తీర్చిదిద్దుతానని, ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్రతిపాదనలను తీసుకురావాల్సిందిగా అధికారులను ఆదేశించారు.
కడియం కావ్యకు ఆషామాషీగా టికెట్ ఇవ్వలేదని, ఉమ్మడి రాష్ట్రం నుంచి కడియం శ్రీహరి నిబద్ధతతో సేవలందించారన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో ఆయన ప్రయత్నం ఉందని, ఆయన అనుభవాన్ని అభివృద్ధికి వినియోగించుకోవాలనుకునే కడియం వారసురాలిగా కావ్యకు టికెట్ ఇచ్చామన్నారు. మాదిగల ఏ,బీ,సీ,డీ వర్గీకరణ, ముదిరాజ్ లను బీసీ-ఏలో చేర్చాలన్న డిమాండ్లు నెరవేరాలంటే కడియం కావ్యను పార్లమెంట్కు పంపించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అంతకుముందు మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో ఏటా రూ.300 కోట్లతో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారని, కానీ ఏ ఒక్క పని చేయలేదన్నారు.