ఓరుగల్లు9నేషనల్ టీవీ :ఢిల్లీ లిక్కర్ స్కామ్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితనే ప్రధాన సూత్రధారి అని, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్తో కలిసి ఆమె కుట్ర పన్నారని సీబీఐ పేర్కొంది. కవితను కస్టడీలోకి తీసుకొని విచారిస్తే మరిన్ని అంశాలు బయటకు వస్తాయని స్పష్టం చేసింది. ఈ మేరకు కస్టడీ అప్లికేషన్ను రౌస్ ఎవెన్యూలోని స్పెషల్ కోర్టులో శుక్రవారం దాఖలు చేసింది. విచారించిన కోర్టు.. కవితను 3 రోజుల సీబీఐ కస్టడీకి అనుమతించింది. 11 పేజీల కస్టడీ అప్లికేషన్లో సీబీఐ సంచలన విషయాలను వెల్లడించింది. లిక్కర్ పాలసీ రూపకల్పన మొదలు, స్కామ్లో పలువురి పాత్ర, కేసు దర్యాప్తులో సేకరించిన ఆధారాలు, సహ నిందితుల స్టేట్మెంట్లను పొందుపరిచింది.
ట్రయల్ కోర్టు పర్మిషన్ తో ఈ నెల 6న తీహార్ జైల్లో కవితను విచారించామని, అయితే ఆమె నుంచి సరైన సమాధానాలు రాలేదని సీబీఐ పేర్కొంది. లిక్కర్ స్కామ్లో కవిత పాత్ర, హవాలా రూపంలో మళ్లించిన డబ్బు వివరాలపై ప్రశ్నించినట్లు తెలిపింది. వీటికి తప్పించుకునే ధోరణిలో కవిత సమాధానాలు చెప్పారని, అందువల్ల కస్టడీలో ఇంటరాగేషన్ చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. లిక్కర్ స్కామ్లో ఇతర భాగస్వాముల నుంచి పొందిన డబ్బులను విజయ్ నాయర్ ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీకి మళ్లించడం, లిక్కర్ పాలసీ రూపకల్పన, అమలులో నిందితులతో కలిసి కవిత కుట్ర పన్నారని సీబీఐ తెలిపింది. ఈ ప్రశ్నలన్నింటిపై కవిత దగ్గర జవాబులు ఉన్నప్పటికీ.. ఉద్దేశపూర్వకంగా ఆమె భిన్నమైన సమాధానాలు ఇచ్చారని, వాస్తవాలను దాచిపెట్టి తప్పించుకోవాలని చూస్తున్నారని, ఆమెకు మాత్రమే తెలిసిన ఎవిడెన్స్లను ముందు పెట్టినా.. నిజాలను అంగీకరిచడం లేదని కోర్టు దృష్టికి తెచ్చింది.
ఈ కేసులో సరైన ముగింపు రావాలంటే.. కవిత దాచిన వాస్తవాలు బయటకు రావాల్సి ఉందంది. ఈ నిజాల్ని రాబట్టేందుకు ఈ ఏడాది ఫిబ్రవరి 26న తమ ముందు హాజరుకావాలని 41ఏ సీఆర్పీసీ కింద నోటీసు ఇచ్చినప్పటికీ ఆమె విచారణకు హాజరు కాలేదని, అందువల్ల కస్టడీకి తీసుకొని సాక్ష్యాలను చూపించి ఇంటరాగేట్ చేస్తేనే ఆమె నుంచి మొత్తం కుట్రకోణం బయటకు వస్తుందని కోర్టుకు తెలిపింది. అక్రమంగా డబ్బుల మళ్లింపు, ఇతర నిందితుల పాత్రతోపాటు ఇతర అంశాలను ఆమె నుంచి రాబట్టాల్సి ఉందని వివరించింది.