జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా : బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, స్త్రీ విద్య కోసం పాటుపడిన జ్యోతిరావు పూలే అందరికి ఆదర్శప్రాయుడని జిల్లా కలెక్టర్ బిఎం. సంతోష్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఐడిఓసి ఆవరణలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతి వేడుకలకు జిల్లా అదనపు కలెక్టర్లు అపూర్వ చౌహాన్, ముసిని వెంకటేశ్వర్లుతో కలిసి పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలకు విద్యను అందించేందుకు అహర్నిశలు శ్రమించిన మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం సంతోషంగా ఉందని తెలిపారు. సామాజిక కార్యకర్త, మేధావి, కులాలకు అతీతంగా బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం, వారిలో ఆత్మ స్థైర్యం నింపి హక్కుల కోసం పోరాడి సాధికారతకు కృషి చేశారని తెలిపారు. తన భార్య సావిత్రిబాయి పూలేతో కలిసి భారత దేశంలో మహిళలకు విద్యను అందించేందుకు పాఠశాలలను ప్రారంభించి విద్యను సమాన హక్కుగా మహిళలకు అందించేందుకు నిరంతరం పాటుపడ్డారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఓ వీరభద్రప్ప, బిసి సంక్షేమ శాఖ ఇంచార్జ్ అధికారిణి శ్వేత ప్రియదర్శిని, ఈడి ఎస్సి కార్పోరేషన్ రమేష్ బాబు, డివైఎస్ఓ బిఎస్. ఆనంద్, కలెక్టరేట్, బిసి వెల్ఫేర్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
అందరికీ ఆదర్శప్రాయుడు పూలే-జిల్లా కలెక్టర్ బీఎం. సంతోష్ ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES