ఓరుగల్లు9నేషనల్ టీవీ :సీఎం కావాలని ఎమ్మెల్సీ కవిత ఎంతో ఆశపడిందని మంత్రి సీతక్క అన్నారు. బీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి.. కేసీఆర్ దిగిపోతే.. తానే సీఎం కుర్చీలో కూర్చుంటానని కలలు కన్నదని తెలిపారు. కాంగ్రెస్ పవర్లోకి రావడంతో ఆమె ఆశలన్నీ అడియాసలయ్యాయని చెప్పారు. ‘‘కవితను ప్రజలు ఓడించినా.. ఆరు నెలల్లోనే ఎమ్మెల్సీ పదవి పొందింది. పిల్లలు ఎగ్జామ్స్లో ఫెయిల్ అయితే సప్లిమెంటరీ పరీక్షల కోసం ఎదురుచూస్తరు. కానీ.. కవిత మాత్రం మేనేజ్మెంట్ కోటాలో పదవి తెచ్చుకున్నది’’అని సీతక్క మండిపడ్డారు. కాకతీయ యూనివర్సిటీలో కేహబ్, పీవీ నాలెడ్జ్ సెంటర్ను మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, కొండా సురేఖతో కలిసి సీతక్క ప్రారంభించారు.
వరంగల్లో దాదాపు రూ.280.85 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీతక్క మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంక్షేమానికి కట్టుబడి ఉంది. కానీ.. బీఆర్ఎస్ నేతలు మహిళలను కాంగ్రెస్ సర్కార్ నుంచి దూరం చేయాలని కుట్ర చేస్తున్నరు. నిరుద్యోగ మహిళలకు ఉద్యోగాలు ఇస్తుంటే.. జీవో నంబర్ 3 ద్వారా అన్యాయం చేస్తున్నామంటూ బీఆర్ఎస్ లీడర్లు దొంగ దీక్షలు చేస్తున్నరు. మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పని చేస్తున్నది. వారికి కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేయదు. గత ప్రభుత్వం మహిళలను విస్మరించింది. మేము వారికి ప్రాధాన్యత ఇస్తుంటే చూసి ఓర్వలేకపోతున్నరు’’అని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు జీతాలు కూడా ఇచ్చే పరిస్థితిలేదన్నారు. కానీ.. ఇప్పుడు ఒకటో తారీఖు రోజే సాలరీ వేస్తుంటే బీఆర్ఎస్ లీడర్లు సహించలేకపోతున్నరని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే గ్యారంటీ అని.. ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారంటీలు అమలు చేస్తామన్నారు.