ఓరుగల్లు9నేషనల్ టీవీ :హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో ఈనెల 28 తేదీన ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్, మార్చి 18 నుంచి ప్రారంభమయ్యే పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణపై వివిధ శాఖల అధికారులతో శనివారం సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ ఇంటర్మీడియట్, పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లను సిద్ధం చేయాలన్నారు. సమస్యాత్మక పరీక్ష కేంద్రాలను గుర్తించి అక్కడ పటిష్టమైన ఏర్పాట్లను చేయాలని, పోలీసు భద్రత పటిష్టంగా ఉండాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద సీసీ కెమెరాల నిఘా తప్పనిసరిగా ఉండాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద ఎలాంటి పొరపాట్లు జరగకుండా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని సూచించారు. అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని పేర్కొ న్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట పోలీస్ బందోబస్తు ఉండే విధంగా చర్యలు చేపట్టాలని ఆ శాఖ అధికారులకు సూచించారు. ఈ నెల 26వ తేదీన పరీక్షల నిర్వహణపై విద్యాశాఖ, పోలీస్ అధికారులతో సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి (డిఐఈవో)ఎ. గోపాల్ మాట్లాడుతూ ఈ నెల (ఫిబ్రవరి) 28వ తేదీ నుండి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణకు వివిధ శాఖల అధికారులు సహకరించాలని కోరారు. ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను నిర్వహించే పరీక్షా కేంద్రాలకు ప్రశ్నాపత్రాల తరలింపు సమయంలో పోలీసు భద్రత కావాలన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద వైద్య సదుపాయం కల్పించాలన్నారు. పరీక్ష సమయంలో విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. విద్యార్థుల కోసం ఆర్టీసీ అధికారులు బస్సు సౌకర్యాలు కల్పించాలన్నారు.
ఈ సమావేశంలో జిల్లా విద్యా శాఖ అధికారి(డిఈవో) డాక్టర్ ఎండీ. అబ్దుల్ హై మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 12033మంది విద్యార్థులు పదో తరగతి వార్షిక పరీక్షలు రాయనున్నారని తెలిపారు. పదో తరగతి వార్షిక పరీక్షల కోసం 68 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. వివిధ శాఖల అధికారుల సమన్వయంతో పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేయనున్నట్లు పేర్కొన్నారు.
ఈ సమావేశంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ మహేందర్ జీ, అడిషనల్ డీఎంహెచ్ఓ డాక్టర్ మదన్ మోహన్ రావు, జిడబ్ల్యూఎంసి డిప్యూటీ కమిషనర్ రవీందర్, పోలీస్ శాఖ నుండి ఎసిపి కిరణ్ కుమార్, ఎస్సై కొమురెల్లి, రవాణా శాఖ ఎంవిఐ కె.వేణు, పోస్టల్ శాఖ ఇన్స్పెక్టర్ హరికృష్ణ, ఆర్టీసీ ఏడీసీ వెంకట్ రెడ్డి, విద్యుత్ శాఖ ఏడీఈ అశోక్, విద్యాశాఖ ఏసిజి చలపతిరావు, జిల్లా ట్రెజరీ శాఖ సీనియర్ అసిస్టెంట్ వినయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.