జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థిని, విద్యార్థులు త్వరలో జరిగే పదవ తరగతి పరీక్షలలో ఉత్తమ ఫలితాలతో వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ బియం. సంతోష్ విద్యాశాఖ అధికారులకు ఆదేశించారు. గురువారం ఐడిఓసిలోని కాన్ఫరెన్స్ హాలు నందు పదవ తరగతి విద్యా బోధన, ప్రత్యేక తరగతుల నిర్వహణ, పర్యవేక్షణ, తదితర అంశాలపై డిఈఓ, ఎంఈఓలు, తదితరులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, సమస్యలు ఉన్న పాఠశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం పెంచాలని, ఫలితాలు 100శాతం వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. మండలాల వారిగా పాఠశాలలు ఏ స్థాయిలో ఉన్నాయని,10వ తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత మెరుగు పరచడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఇప్పటివరకు ఎన్ని స్లిప్ టెస్టులు పెట్టారు, ఎంతమంది విద్యార్థులు హాజరయ్యారు, వారికి వచ్చిన మార్కులు ఎన్ని, పాఠశాలల వారిగా, మండలాల వారిగా జాబితా ఇవ్వాలని ఆదేశించారు. విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించడం, ముఖ్యమైన పాఠ్యాంశాలపై ప్రత్యేక అవగాహన కల్పించాలని సూచించారు. ఆయా సబ్జెక్టులలో విద్యార్థుల బోధన విషయంలో సబ్జెక్టు టీచర్ల పాత్రే కీలకమన్నారు. విద్యార్థి భవిష్యత్తుకు పదవ తరగతి పునాది లాంటిదని, సబ్జెక్టు టీచర్లు, ప్రధానోపాధ్యాయులు సమన్వయంతో ఒక టీంగా పనిచేస్తే అనుకున్న ఫలితాలు వస్తాయన్నారు. ఈ సమావేశంలో జిల్లా విద్యా శాఖ ఇన్ఛార్జి అధికారి ఇందిర, శ్రీనివాస్, ప్రతాప్ రెడ్డి, ఎస్తేర్ రాణి, మండల విద్యాధికారులు, సెక్టార్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
పది విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి-జిల్లా కలెక్టర్ బీయం. సంతోష్ ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES