Monday, June 30, 2025

గోపాల్ దిన్నెలో నాలుగేళ్లుగా పరిష్కారం కాని నీటి సమస్య-మిషన్ భగీరథ పైపులైన్ వేసినా గ్రామం మొత్తం సరఫరా కాని తాగునీరు-పట్టించుకోని గ్రామ సర్పంచు, గ్రామ కార్యదర్శి, అధికారులు-సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేకి విన్నవించిన గ్రామస్తులు-కార్యక్రమం మధ్యలోనే వెళ్లిపోయిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే ఓరుగల్లు9నేషనల్ టీవీ

జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి :- జోగులాంబ గద్వాల జిల్లా, అల్లంపూర్ నియోజకవర్గంలోని ఇటిక్యాల మండలం, గోపాలదిన్నె గ్రామంలో గత నాలుగేళ్లుగా గ్రామస్తులు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారం కోసం గద్వాల మండలంలోని రేపల్లె గ్రామం నుంచి మిషన్ భగీరథ పైపులైన్ నిర్మించి తాగునీరు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకున్నారు. కానీ ఆ నీరు గ్రామంలోని కొంత భాగానికే సరఫరా అవుతుండడం, ఆ ఇళ్లకు సంబంధించిన వారు నీటి గుంతలు ఏర్పాటు చేసుకోవడంతో అక్కడి వరకే నీరు పారుతూ మిగతా ఇళ్లకు సరఫరా కాకపోవడంతో వారంతా నీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని గ్రామ సర్పంచు, పంచాయతీ కార్యదర్శి, మండల అధికారులకు పలుమార్లు విన్నవించినా వారు ఏ మాత్రం స్పందించడం లేదని, గ్రామంలో మిషన్ భగీరథ నీరు సరఫరా అవుతున్న కొన్ని ఇళ్లకు చెందిన వారి మాటలు పట్టించుకుంటూ నీరు సరఫరా కానీ వారి మాటలను ఏ మాత్రం లెక్క చేయడం లేదని వాపోయారు. ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలకు విన్నవించినా ఫలితం శూన్యం… గోపల్ దిన్నె గ్రామంలో మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా పాఠశాల అదనపు గదులను నిర్మించగా, బుధవారం అలంపూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రాందేవ్ రెడ్డి, గ్రామ సర్పంచు రాధాకృష్ణా రెడ్డిల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అదనపు గదుల ప్రారంభోత్సవానికి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. అనంతరం జరిగిన సన్మాన సభలో త్వరలో పదవి కాలం పూర్తి చేసుకోబోతున్న ఇటిక్యాల మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులను శాలూవాలతో సత్కరించారు. ఇక్కడి దాకా కార్యక్రమం సజావుగా సాగినప్పటికీ ఆ తరువాత ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే ఇద్దరు సభ ప్రాంగణాన్ని వీడి అర్థాంతరంగా ముగించి వెళ్లిపోయారు. దీనిపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మా గ్రామంలో నెలకొన్న సమస్యలను వినకుండా, వాటికి పరిష్కారం చూపకుండా, మాజీ మార్కెట్ చైర్మన్ మాట విని ఇలా మధ్యలోనే వెళ్లిపోతే మా సమస్యలను వినే వారేవరని, గ్రామంలో ఉన్న నాయకులు నాలుగేళ్లుగా పట్టించుకోకుండా, ఇప్పుడు మీరు వినకుండా వెళ్తే మా గోడును పట్టించుకునే నాథుడే లేడా అని వాపోయారు. దీనిపై గ్రామస్తులను అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులు వివరాలు కోరగా గ్రామంలో నాలుగేళ్లుగా తాగునీటి సమస్య ఉందని, గ్రామంలో మొత్తం 850మంది ఓటర్లు ఉండగా 500ల వరకు నివాస గృహాలు ఉన్నాయని తెలిపారు. మా గ్రామానికి 80వేల లీటర్ల నీరు రోజు సరఫరా కావాల్సి ఉండగా, కేవలం 40వేల లీటర్లు మాత్రమే సరఫరా అవుతుండడం, వాటిని కూడా అందరికీ అందకుండా చాలామంది వారి ఇళ్ల ముందు కుళాయి గుంతలు తీసుకోవడం, మోటర్లు వేయడం వల్ల గ్రామంలోని ఎస్సీ, బీసీ కాలనీలకు దాదాపు ఒక 20ఇండ్లకు మాత్రమే నీరు పారుతుందని చెప్పారు. మిగతా ఇళ్లకు నీరు ఏ మాత్రం రావడం లేదని, గ్రామంలో ఉన్న సర్పంచుకి, గ్రామ కార్యదర్శికి ఎన్ని సార్లు విన్నవించినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. అయితే గ్రామానికి మిషన్ భగీరథ నీరు రేపల్లె గ్రామం నుంచి పైపు లైన్ వేయడం జరిగిందని, దీంతో ఆ గ్రామం నుంచి ఏమాత్రం నీరు రావడం లేదని పేర్కొన్నారు. అయితే గ్రామ సమస్య తీరాలంటే పక్కనే ఉన్న మొగలి రావులచెరువు గ్రామం నుంచి పైపు లైన్ వేస్తే మా గ్రామంలో ఉన్న నీటి సమస్య తీరుతుందని గ్రామస్తులు విన్నవించారు. ఇదే విషయాన్ని గ్రామానికి వచ్చిన ఎమ్మెల్సీ చల్లా వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడికి విన్నవించామని, అయితే వారు సమస్యపై ఏ మాత్రం స్పందించకుండా సభ మధ్యలోనే వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా గ్రామంలో కుళాయి గుంతలు ఎవరికైతే ఉన్నాయో ఆ గుంతలను పూర్తిగా పూడిస్తే ఎలాంటి సమస్య ఉండదని గ్రామస్తులు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి హనుమంతు రెడ్డి, సింగిల్ విండో అధ్యక్షుడు రంగారెడ్డి, గ్రామ ఉప సర్పంచు పద్మమ్మ, మత్స్యశాఖ జిల్లా అధ్యక్షుడు గోపాల్, శ్రీనివాస్ రెడ్డి డైరెక్టర్ దానం, అనంతరెడ్డి, సుదర్శన్ రెడ్డి, లక్ష్మీనారాయణ రెడ్డి, మాజీ జెడ్పిటిసి సుందర్, రవి ప్రకాష్, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular