జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:-జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రయివేటు పాఠశాలలకు ధీటుగా విద్యా బోధన చేయాలని, అలాగే వారికి ప్రభుత్వ మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం పెట్టాలని జిల్లా పరిషత్ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జి సరిత అన్నారు. శుక్రవారం ఆమె మల్దకల్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సరిత విద్యార్థుల తరగతులను సందర్శించి ఉపాధ్యాయులు చెప్పే విద్యా బోధనపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అలాగే పాఠశాల పరిసరాలను పరిశీలించి, శిథిలావస్థకు చేరిన గదులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ పాఠశాల మనఊరు మనబడి కింద ఎంపిక అయినప్పటికీ పాఠశాలలో పనులు ప్రారంభం కాకపోవడానికి గల కారణాలపై సంబంధిత అధికారులను ఫోన్ ద్వారా అడిగి తెలుసుకున్నారు. పనులు చేస్తానన్న కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల పనులు ఆగిపోయాయని వారు సమాధానం ఇవ్వడంతో ఆ కాంట్రాక్టర్ చేయలేకపోతే వేరే వారికి పనులు అప్పజెప్పి త్వరగా పనులు పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆనంతరం పాఠశాలలో విద్యార్థులకు పెట్టే మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి ప్రభుత్వ మెనూ ప్రకారం పౌష్టికాహారంతో కూడిన భోజనం విద్యార్థులకు పెట్టాలని, మధ్యాహ్న భోజనంపై ఉపాధ్యాయుల పర్యవేక్షణ ప్రతి రోజు ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ బండారి భాస్కర్, కాంగ్రెస్ నాయకులు బండ్ల రాజశేఖర్ రెడ్డి, పెద్దపల్లి రాజశేఖర్ రెడ్డి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి-జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరిత ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES