జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:-జోగులాంబ గద్వాల జిల్లాలో తుంగభద్ర నది నుంచి ఇసుక అక్రమ రవాణాకు ఎలాంటి ఆస్కారం లేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టడం జరుగుతుందని, ఇసుక అవసరమున్న వారు ఆన్లైన్లో అనుమతి తీసుకొని ఇసుక రీచ్ ల ద్వారా మాత్రమే తీసుకెళ్లాలని జిల్లా ఎస్పీ రితిరాజ్ అన్నారు. శుక్రవారం జిల్లా ఎస్పీ తుంగభద్ర నది తీర గ్రామాలైన తూర్పు గార్లపాడు, తుమ్మిళ్ల, చిన్న ధన్వాడ, పెద్ద ధన్వాడ, వేణి సోంపురం గ్రామాలలో నిల్వ ఉంచిన ఇసుక డంపులను సందర్శించి ఆన్లైన్లో ఇసుక అనుమతులు పొంది ఇసుక రీచ్ ల నుంచి ఇసుకను తీసుకెళ్లే వారి వివరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ తుంగభద్ర నది తీర గ్రామాలలో గుర్తించిన ప్రదేశాలలో ఉన్న ఇసుక డంపుల నుంచి ఆన్లైన్లో బుకింగ్ చేసుకున్న విధానం ప్రకారం వాహనాలకు అనుమతి ఇవ్వడం జరుగుతుందని, అనుమతి లేని వాహనాల నుంచి అక్రమంగా ఎట్టి పరిస్థితుల్లోనూ తరలకుండా గట్టి చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ పోలీస్ అధికారులకు, మైనింగ్ అధికారులకు సూచించారు. ప్రజలు కూడా ఇసుక అవసరం అయిన వాళ్లు ఆన్లైన్ ద్వారా అనుమతి పొంది తీసుకెళ్లాలని సూచించారు. ఇసుక రీచ్ ల దగ్గర నిరంతరం సంబంధిత శాఖ అధికారులు కాపలా ఉండాలని, అక్రమంగా ఇసుక రవాణా జరుగకుండా పటిష్టమైన నిఘా ఉంచాలని మైనింగ్ అధికారులకు సూచించారు. నది తీర ప్రాంతంలో, ఇసుక రీచ్ లు ఉన్న ప్రాంతంలో బ్లూ కోల్ట్స్, పెట్రో కార్స్ సిబ్బందితో మరింత నిఘా పెంచాలని, అలాగే ఇసుక అక్రమ రవాణా జరుగకుండా విస్తృత తనిఖీలు చేపట్టాలని ఎస్సైలకు సూచించారు. అలాగే గ్రామస్తులతో మాట్లాడుతూ ఇసుక అక్రమ రవాణాకు సంబంధించిన సమాచారం వస్తే సంబంధిత పోలీస్ అధికారులకు లేదా డయల్ -100కు కాల్ చేసి సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ వెంకటేశ్వర్లు, శాంతినగర్ సిఐ శివశంకర్, రాజోలి ఎస్సై, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు-జిల్లా ఎస్పీ రితిరాజ్ ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES