ఓరుగల్లు9నేషనల్ టీవీ హనుమకొండ: రానున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాల్లో జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఉన్నారు.
హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో అదనపు కలెక్టర్ రాధిక గుప్తా, జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ అబ్దుల్ హై లతో పాటు హనుమకొండ జిల్లాలోని బిసి, సోషల్, ట్రైబల్, మైనారిటీ వెల్ఫేర్ పాఠశాలల అధికారులతో పదో తరగతి విద్యార్థులకు రానున్న పబ్లిక్ పరీక్షలకు సన్నద్దత, బోధన, శిక్షణ ఎలా జరుగుతోంది, ఏ విధంగా సన్నద్ధం చేస్తే బాగుంటుందనే అంశాలపై బుధవారం సాయంత్రం సమీక్ష సమావేశాన్ని జిల్లా కలెక్టర్ నిర్వహించారు.
ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థులకు పాఠ్యాంశాలు ఎంతవరకు పూర్తయ్యాయని, ఏ విధంగా పరీక్షలు నిర్వహించారని, రివిజన్ ఏ విధంగా చేయిస్తున్నారని, పబ్లిక్ పరీక్షలకు ఏ విధంగా విద్యార్థులను సిద్ధం చేస్తున్నారనే విషయాలతో పాటు ఆయా సబ్జెక్టులకు సంబంధించిన స్టడీ మెటీరియల్ ను గురించి ఆయా గురుకుల విద్యాలయాల అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
మార్చి 18వ తేదీ నుండి జరగబోయే పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు విద్యార్థులకు అందించిన ఆయా సబ్జెక్టుల సిలబస్, టెస్టులు, అందించిన స్టడీ మెటీరియల్, ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో విద్యార్థులకు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతుల గురించి ఆయా విద్యాలయాల అధికారులు కలెక్టర్ కు వివరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ మార్చిలో జరగబోయే పదో తరగతి పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధమయ్యే విధంగా సిద్ధం చేయాలన్నారు. విద్యార్థులు ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పరీక్షలను రాసే విధంగా సంసిద్ధం చేయాలని సూచించారు. పదో తరగతి విద్యార్థులను సంసిద్ధం చేయడంలో ఉపాధ్యాయులు పర్యవేక్షణ ఉండేలా చూడాలన్నారు. విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని పేర్కొన్నారు. పదో తరగతి విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో క్వాలిటీ కోఆర్డినేటర్ ఏ.శ్రీనివాస్, విషయ నిపుణులు సంపతి, మహేష్,సతీష్ ప్రకాష్, శ్రీను ఆనంద్, బీసీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్,ట్రైబల్ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్, టీఎస్ రెసిడెన్షియల్ ఆర్ సి ఓ లు పాల్గొన్నారు.