జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిగా, కొలిచిన వారికి కొంగు బంగారంగా గద్వాల జిల్లా కేంద్రంలోని భీంనగర్ కాలనీలో కొలువైన సంతాన వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా మొదటి రోజు ఆలయ అర్చకులు ఆలయంలో పుణ్యహవచనం, అంకురారోపణ, ధ్వజారోహణం, బేరి పూజ, హోమాలు, ప్రత్యేక పూజలు చేసి ఉత్సవాలను ప్రారంభించారు. సాయంత్రం స్వామివారి కల్యాణోత్సవాన్ని వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యా మధ్య అత్యంత భక్తి శ్రద్ధలతో, కన్నుల పండుగగా జరిపించారు. బ్రహ్మోత్సవాల ప్రారంభోత్సవానికి రాజ వంశీయులు, ఆలయ ధర్మకర్తలు డాక్టర్ సుహాసిని రెడ్డి, విక్రమ్ సింహ రెడ్డిలు హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామివారి బ్రహ్మోత్సవాలు మూడు రోజులపాటు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. అలాగే బుధవారం జరిగే రథోత్సవానికి హాజరయ్యే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని సౌకర్యాలు కల్పించినట్లు ఆలయ ధర్మకర్తలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గద్వాల పట్టణంతోపాటు వివిధ గ్రామాల భక్తులు తదితరులు పాల్గొన్నారు.
వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలను ప్రారంభించిన ఆలయ ధర్మకర్తలు ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES