జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని భీంనగర్ కాలనీలో వెలసిన అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మద్యాంత రహితుడు అయిన సంతాన వేణుగోపాల స్వామి వారి బ్రహ్మోత్సవాలు మంగళవారం నుంచి గురువారం వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్తలు, రాజ వంశీయులు డాక్టర్ సుహాసిని రెడ్డి, విక్రమ్ సింహా రెడ్డిలు తెలిపారు. ఇందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు, భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు కల్పించాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేశామన్నారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా మంగళవారం ఉదయం పుణ్యహవచనం, అంకురారోహణం, ద్వజారోహణ పూజ, హోమం, సాయంత్రం కళ్యాణోత్సవం, అన్నదానం జరుగుతాయని తెలిపారు. రెండవ రోజు బుధవారం నిత్య హోమం, సాయంత్రం రథోత్సవం, స్వామి వారి సేవ, ఊరేగింపు, ఊంజల్ సేవ, ప్రసాద వితరణ, గురువారం పారువేట, తీర్తావలి, నాగావళి, పూర్ణాహుతి, దేవతా విసర్జన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.
ఆలయ విశిష్టత…
సంతాన వేణుగోపాలస్వామి దేవాలయం చాలా పురాతనమైనది. ఈ ఆలయాన్ని గద్వాల సంస్థానాన్ని పాలించిన మహారాజు సీతారాం భూపాల్ తల్లి లక్ష్మీ నాంచారమ్మ స్థాపించారు. ముఖ్యంగా ఈ ఆలయంలో కొలువై ఉన్న సంతాన వేణుగోపాల స్వామిని సంతానం లేని దంపతులు దర్శించుకుని పూజలు నిర్వహించి స్వామి ఆశీస్సులు పొందితే వారికి శీఘ్రంగా సంతానం సిద్ధిస్తుందన్నది అనాధిగా వస్తున్న భక్తుల నమ్మకం. సంతానం కలుగజేసే స్వామి అయినందున ఇక్కడున్న వేణుగోపాల స్వామిని సంతాన వేణుగోపాల స్వామి అని పిలుస్తున్నారు. వేణుగోపాల స్వామివారు ఒక సంతానం లేనివారి కోరిక తీర్చడమే కాకుండా భక్తితో పూజింజే ప్రతి ఒక్కరి మనస్సులో వారు కోరిన కోరికలు తీర్చే స్వామిగా, గద్వాల ప్రజల ఇలవేల్పుగా వేణుగోపాల స్వామి విరాజిల్లుతున్నారు. కావున భక్తులు ఎవరైనా సంతానం లేని దంపతులు సంతానం కోసం, అదేవిధంగా తీరని కోరికలున్న వారు బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారిని దర్శించుకుని స్వామి కృపకు పాత్రులు కావాలని ఆలయ ధర్మకర్తలు కోరుతున్నారు.
నేటి నుంచి సంతాన వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలు ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES