ఓరుగల్లు9నేషనల్ టీవీ :రైతుబంధు విడుదల చేస్తే ఆ పైసలతోనే రైతుల ఖర్చులు వెళ్లిపోయేవి, కానీ కొత్త ప్రభుత్వం ఏర్పడి రోజులు గడుస్తున్నా ఇంతవరకూ రైతుబంధు ఇస్తలేరు. పెట్టుబడికి పైసల్లేక రైతులు ఇబ్బంది పడుతున్నరు, పెట్టుబడి సాయం ఇంకెప్పుడిస్తరు’ అంటూ ఎంపీపీలు, జడ్పీటీసీలు ఆఫీసర్లను నిలదీశారు. ఆఫీసర్లు సమాధానం చెప్పే ప్రయత్నం చేసినా వినకపోవడంతో హనుమకొండ జడ్పీ మీటింగ్ గందరగోళంగా సాగింది. జడ్పీ చైర్మన్ సుధీర్కుమార్ అధ్యక్షతన హనుమకొండలోని జడ్పీ హాల్లో శనివారం జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించారు.
సమావేశానికి జడ్పీ సీఈవో వెంకటేశ్వరరావు, జడ్పీ వైస్ చైర్మన్ గజ్జెల శ్రీరాములు, జడ్పీటీసీలు, ఎంపీపీలు హాజరయ్యారు. సమావేశం ప్రారంభం కాగానే సభ్యులంతా రైతుబంధుపైనే వ్యవసాయాధికారులను నిలదీశారు. రైతుబంధు ఎన్ని ఎకరాలకు వరకు ఇస్తున్నారో అర్థం కావడం లేదని, ఈ విషయంపై క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీంతో ఎకరంలోపు భూమి ఉన్న రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేస్తున్నామని, ఇప్పటివరకు జిల్లాలోని 52,325 మంది రైతుల ఖాతాల్లో రూ.13.58 కోట్లు జమ చేసినట్లు ఆఫీసర్లు చెప్పారు. రుణమాఫీ విషయం గురించి సభ్యులు నిలదీయగా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని, క్లారిటీ రాగానే ఆ ప్రక్రియ కూడా పూర్తి చేస్తామని ఆఫీసర్లు సమాధానమిచ్చారు.
గత ప్రభుత్వం నిధులు విడుదల చేసినా దళితబంధు ఇవ్వడం లేదని వేలేరు ఎంపీపీ సమ్మిరెడ్డి చెప్పగా రెండో విడత లబ్ధిదారుల ఎంపిక ఇంకా పూర్తి కాలేదని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ సమాధానం ఇచ్చారు. ఉదయం 10.45 గంటలకు ప్రారంభమైన జడ్పీ మీటింగ్ మధ్యాహ్నం 1.30 వరకు కొనసాగింది. కాగా కొత్తగా ఎమ్మెల్యేగా ఎన్నికైన కేఆర్.నాగరాజు మొదటిసారి మీటింగ్కు రావడంతో సభ్యులంతా ఆయనను సన్మానించారు.