Monday, June 30, 2025

మల్దకల్ జాతరలో భక్తుల నిలువు దోపిడీ-ఇష్టానుసారంగా ధరలు పెంచి విక్రయిస్తున్న టెంకాయల కాంట్రాక్టర్-పట్టించుకోని దేవాదాయ, పంచాయతీ అధికారులు ఓరుగల్లు9నేషనల్ టీవీ

జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లాలో ఆదిశిలా క్షేత్రంగా, రెండవ తిరుపతిగా వెలుగొందుతున్న మల్దకల్ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భక్తులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. భగవంతునికి భక్తులు మొక్కులు తీర్చుకోవడానికి అతి ముఖ్యమైనది టెంకాయలు… టెంకాయలకు అంతటి ప్రాధాన్యత కలిగినందుకే ప్రతి ఏడాది బ్రహ్మోత్సవాల సందర్భంగా టెంకాయల వేలం దక్కించుకునేందుకు కాంట్రాక్టర్ల మధ్య తీవ్ర పోటీ నెలకొంటుంది. ఈ ఏడాది నిర్వహించిన వేలంలో కర్నూలుకు చెందిన మద్దిలేటి గౌడ్ రూ. 17లక్షలపైగానే వేలం పాటను దక్కించుకున్నారు. దీంతో జాతరకు వచ్చే భక్తులకు టెంకాయలను అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ చిరు వ్యాపారులకు ఒక్క టెంకాయ ధర రూ. 30లకు విక్రయిస్తుండగా, వారు భక్తులకు జత టెంకాయలను రూ. 80ల చొప్పున విక్రయిస్తున్నారు. దీంతో చిరు వ్యాపారుల నుంచి కాంట్రాక్టర్, భక్తుల నుంచి చిరు వ్యాపారులు లాభాలు ఆశిస్తుండడం జరుగుతుంది. ఈ ఇద్దరి వ్యవహారంతో జాతరకు వచ్చిన సామాన్య భక్తుల జేబులకు మాత్రం చిల్లులు పడుతున్నాయి. ఈ విషయం అటు దేవాదాయ శాఖ, ఆలయ అధికారులకు, గ్రామ పంచాయతీ అధికారులకు తెలిసినా ఎవరు పట్టించుకోకపోవడంతో జాతరకు వచ్చిన భక్తులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి జాతరలో ఇలాంటి పరిస్థితి మరోసారి తలెత్తకుండా కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular