జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా ప్రస్తుతం చలిగాలులు ఎక్కువగా వీస్తుండడంతో రోడ్లపై పొగమంచు కమ్ముకుంటుందని, వాహనదారులు ఉదయం రోడ్డుపైకి వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని గద్వాల పట్టణ ట్రాఫిక్ ఎస్సై విజయ్ భాస్కర్ సూచించారు. బుధవారం ఆయన ట్రాఫిక్ కార్యాలయంలో విలేఖర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ పొగమంచు వల్ల రోడ్డుపై ఎదురుగా వచ్చే వాహనాలు సరిగా కనపడకపోవడంతో రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందన్నారు. ప్రమాదాలు జరగకుండా వాహనదారులు పూర్తి జాగ్రత్తతో నడపాలని కోరారు. వాహనం హెడ్లైట్లను తక్కువ దూరంలో ఉండేట్లుగా పెట్టుకోవాలని, అతి వేగంతో వాహనాన్ని నడపరాదని సూచించారు. ఎదురుగా వస్తున్న వాహనాల శబ్దాన్ని గమనించి వాహనాన్ని నడపాలన్నారు. వాహనానికి ఉన్న ఇండికేటర్లను వాడుతూ, మలుపు తిరిగేటప్పుడు వెనక నుంచి వచ్చే వాహనాలు నెమ్మదిగా వెళ్లేలా కనీసం పది సెకన్లపాటు సూచన ఇవ్వాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ముందు వెళ్తున్న వాహనాలను ఓవర్ టేక్ చేయవద్దని కోరారు. వాహనాల మధ్య దూరం పాటిస్తూ, రహదారిపైనే దృష్టి కేంద్రీకరించాలన్నారు. ట్రాఫిక్, వాతావరణ పరిస్థితులపై దృష్టి పెట్టడం ప్రతి డ్రైవర్ బాధ్యత అని అన్నారు.
పొగ మంచుతో వాహనదారులు జాగ్రత్త-ట్రాఫిక్ ఎస్సై విజయ్ భాస్కర్ ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES