జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని భీంనగర్ కాలనీలో వెలసిన సంతాన వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు జనవరి 2నుంచి 4వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఆలయ ధర్మకర్తలు తెలిపారు. బుధవారం బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికలను ఆలయ ధర్మకర్తలు, అర్చకులు ఆలయ ప్రాంగణంలో విడుదల చేశారు. ముందుగా ఆహ్వాన పత్రికలకు సంతాన గోపాలస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజవంశీయులు, ఆలయ ధర్మకర్త సుహాసిని రెడ్డి, విక్రమ్ సింహ రెడ్డిలు మాట్లాడుతూ ఈ దేవాలయం చాలా పురాతనమైనదని, ఆలయాన్ని గద్వాల సంస్థానాన్ని పాలించిన మహారాజు సీతారాంభూపాల్ తల్లి, మా అవ్వ లక్ష్మీ నాంచారమ్మ స్థాపించారని తెలిపారు. ఈ ఆలయం విశిష్టత ఏమిటంటే సంతానం లేని వారు ఇక్కడున్న వేణుగోపాల స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందితే వారికి శీఘ్రంగా సంతానం సిద్ధిస్తుందన్నది అనాధిగా వస్తున్న ఆచారం అని అన్నారు. సంతానం కలుగజేసే స్వామి అయినందున స్వామివారిని సంతాన వేణుగోపాల స్వామి అని పిలుస్తారని చెప్పారు. స్వామివారిని ఒక సంతానం కోసమే కాకుండా భక్తుల మనస్సులో కోరిన కోరికలన్ని తీర్చే ఇలవేల్పుగా వేణుగోపాల స్వామి విరాజిల్లుతున్నారని అన్నారు. కావున భక్తులు ఎవరైనా సంతానం లేని దంపతులు సంతానం కోసం, అదేవిధంగా తీరని కోరికలున్న వారు బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారిని దర్శించుకుని స్వామి ఆశీస్సులు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంయుక్తమ్మ, అర్చకులు సంవృత్ భరద్వాజ్, భక్తులు సతీష్, బజారన్న, రవి పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక విడుదల-జనవరి 2నుంచి 4వరకు సంతాన వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు-3న స్వామివారి రథోత్సవం ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES