ఓరుగల్లు9నేషనల్ టీవీ :ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, ఫుడ్ డెలివరీ బాయ్స్ వంటి గిగ్వర్కర్లకు రూ. 5 లక్షల ప్రమాద బీమాను అందించడంతో పాటు రాజీవ్ ఆరోగ్య శ్రీ కింద రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తామని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. క్యాబ్ డ్రైవర్లకు ఓలా, ఉబర్ తరహాలో టీహబ్ ద్వారా సర్కార్ యాప్ను అందుబాటులోకి తెస్తామని చెప్పారు. నాలుగు నెలల కింద ఫుడ్ డెలివరీ చేసేటప్పుడు కుక్క తరమడంతో మూడో అంతస్తు నుంచి పడి చనిపోయిన ఫుడ్ డెలివరీ బాయ్ వివరాలను తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. అతడి కుటుంబానికి రూ.2 లక్షల పరిహారం అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు.
రాజస్థాన్లో గిగ్ వర్కర్ల శ్రేయస్సు కోసం చట్టం చేశారని, దాన్ని స్టడీ చేసి అలాంటి చట్టాన్ని వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెడతామని ఆయన హామీ ఇచ్చారు. అసంఘటిత కార్మికుల ఉపాధి, సామాజిక భద్రతకు చర్యలు తీసుకుంటామన్న రాహుల్ గాంధీ హామీని నిలబెడతామన్నారు. అందుకు విధానపరమైన నిర్ణయం తీసుకుంటామని, గిగ్ వర్కర్లకు సామాజిక భద్రతను కల్పిస్తామని హామీ ఇచ్చారు. శనివారం హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ఆలిండియా ప్రొఫెషనల్ కాంగ్రెస్ (ఏఐపీసీ) చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన గిగ్వర్కర్ల సమావేశంలో సీఎం రేవంత్రెడ్డి పాల్గొన్నారు. గిగ్ వర్కర్లు సీఎం వద్ద తమ గోడును వెళ్లబోసుకున్నారు. అండగా ఉంటామని, సమస్యలను పరిష్కరిస్తామని వారికి సీఎం రేవంత్ హామీ ఇచ్చారు.