ఓరుగల్లు9నేషనల్ టివి ప్రతినిధి హనుమకొండ: ఈ నెల మూడో తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు హనుమకొండ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ తెలిపారు.
వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డులోని స్ట్రాంగ్ రూమ్ ల వద్ద జరగనున్న ఎన్నికల కౌంటింగ్ ఏర్పాట్లను హనుమకొండ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిక్తా పట్నాయక్ శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. జిల్లాలోని పరకాల, వరంగల్ పశ్చిమ. నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి చేసిన ఏర్పాట్లను పరిశీలించి వాటి గురించి అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ తెలిపారు. పరకాల, వరంగల్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన విద్యుత్, ఎల్ఈడి, తదితర ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. కౌంటింగ్ కేంద్రాల లోపల ఏర్పాట్లను పరిశీలించారు. ఓట్ల లెక్కింపు ఏర్పాట్లను గురించి రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ ను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఇంకా ఏవైనా ఏర్పాట్లు చేయాల్సి ఉంటే త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ ల వద్ద ఉన్న భద్రతను గురించి అక్కడ పహారాలో ఉన్న భద్రత బలగాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. 24 గంటల పాటు భద్రతా బలగాలు పహారాతోపాటు, సీసీ కెమెరాలతో భద్రత కల్పిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. అదేవిధంగా కంట్రోల్ రూమ్, మీడియా సెంటర్లను కలెక్టర్ సందర్శించారు. కేంద్రాల్లో ఏర్పాటు చేసిన ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు.

డిసెంబర్ మూడో తేదీన ఉదయం ఎనిమిది గంటలకు వరంగల్ ఏనుగుల వ్యవసాయ మార్కెట్ యార్డులో పరకాల, వరంగల్ పశ్చిమ నియోజకవర్గాలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ముందస్తుగా లెక్కింపు ఉంటుందన్నారు. సాంగ్ రూమ్ నుంచి కౌంటింగ్ హాలుకు ఈవీఎంల తరలింపు ప్రక్రియ సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. కౌంటింగ్ నిర్వహణలో ఎన్నికల కమిషన్ నిబంధనలు, మార్గదర్శకాలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపు సంబంధించి అధికారులు సిబ్బంది ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలను పాటించాలని, నిబంధనలను గుర్తుంచుకోవాలన్నారు. ప్రతి కంట్రోల్ యూనిట్ లో నమోదైన మొత్తం ఓట్ల వివరాలు చూపించి, ఆ తరువాత అభ్యర్థుల వారీగా వచ్చిన ఓట్ల వివరాలు అందరికీ స్పష్టంగా తెలిసేలా చూపించాలన్నారు. ఆ వివరాలను పకడ్బందీగా నమోదు చేయాలని కలెక్టర్ తెలిపారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కౌంటింగ్ హాలులో 14 టేబుల్ లను ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి టేబుల్ వద్ద కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్ ఉంటారని తెలిపారు. పరకాల నియోజకవర్గంలో 17 రౌండ్లు, వరంగల్ నియోజకవర్గంలో 18 రౌండ్ల ఎన్నికల కౌంటింగ్ ఉంటుందని కలెక్టర్ తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ కు సంబంధించి వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి 8 కౌంటర్లు, పరకాల నియోజకవర్గానికి నాలుగు కౌంటర్లు ఏర్పాటుచేసి ముందుగా పోస్టల్ బ్యాలెట్ లను లెక్కిస్తారని తెలిపారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా నమోదు అయ్యేలా చూసుకోవాలని పేర్కొన్నారు. కౌంటింగ్ ప్రక్రియకు రిటర్నింగ్ అధికారులు ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకోవాలని, పోస్టల్ బ్యాలెట్, ప్రతి రౌండ్ కౌంటింగ్ ముగిసిన తర్వాత ఫలితాలను మీడియా సెంటర్ ద్వారా విడుదల చేయాలని, మీడియా సెంటర్లో ఉండే పాత్రికేయులకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు.