జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లాలో ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పి ఓ, ఏపిఓలు ఈవిఎం యంత్రాల పనితీరుపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి వల్లూరు క్రాంతి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఎంఏఎల్డి డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్న శిక్షణ తరగతులకు కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ శిక్షణ కార్యక్రమాల్లో శిక్షణ పొందుతున్న పి.ఓ, ఏ.పి.ఓలు ఈవీఎం, వివి ప్యాట్లు, హ్యాండ్ బుక్, పోలింగ్ కేంద్రాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వివి ప్యాట్లను పోలింగ్ కేంద్రాలలో అమర్చడం, మాక్ పోలింగ్ నిర్వహణపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. పోలింగ్ మొదలుకొని పూర్తయ్యే వరకు బాధ్యతగా ఉండాలని, శిక్షణ తరగతులను అర్థం చేసుకుని ఎన్నికల విధులకు సంబంధించిన అన్ని అంశాలపై పరిపూర్ణమైన అవగాహన ఏర్పర్చుకోవాలని తెలిపారు. ఈవిఎంల కనెక్షన్ సరిగా చేయాలని, 20మంది అభ్యర్థులు పోటీలో ఉన్నందున రెండు బ్యాలెట్ యూనిట్లు ఉంటాయని, రెండవ బ్యాలట్ యూనిట్ ఒకటవ బ్యాలట్ యూనిట్ కు, ఒకటవ బ్యాలట్ యూనిట్ నుంచి వీవీప్యాట్ కి కన్నెక్ట్ చేయాలని, వీవీప్యాట్ కంట్రోల్ యూనిట్ కు కన్నెక్ట్ చేయాలని తెలిపారు. పోలింగ్ ప్రారంభానికి కంటే 90నిమిషాల ముందు ఏజెంట్ల సమక్షంలో మాక్ పోల్ నిర్వహించాలని, మాక్ పోలింగ్ ను ఉదయం 5:30గంటలకు చేపట్టాలని, ఏజెంట్ల మాక్ పోల్ కి హాజరు కానప్పుడు15నిమిషాలు ఆగి లేనిపక్షంలో మైక్రో అబ్జర్వర్ కు సమాచారామిచ్చి స్టార్ట్ చేయాలని అన్నారు. ముందుగా సియులో క్లియర్ బటన్ ప్రెస్ చేసి సియులో అందరు అభ్యర్థులకు 0 ఓట్లు ఉన్నాయని ఏజెంట్లకు చూపించాలని,మొత్తం 50 ఓట్లు పోల్ అయ్యాక సియులోని క్లోజ్ బటన్ ప్రెస్ చేసి క్లియర్ చేయాలన్నారు. మాక్ పోల్ సర్టిఫికేట్లో నమోదు చేయాలన్నారు. మాక్ పోల్ నిర్వహించి తప్పనిసరిగా ఇన్ఫర్మేషన్ మొత్తం క్లియర్ చేసుకోవాలని తెలిపారు. ఉదయం 7గంటలకు పోలింగ్ స్టార్ట్ చేయాలని తెలిపారు. 29వ తేదిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ ప్రియదర్శిని కళాశాల నందు సెక్టార్ వారిగా సంబంధించిన పోలింగ్ స్టేషన్లకు ఈవిఎంలను అందచేస్తామని, జాబితా ప్రకారంగా ఈవిఎంలు, సీరియల్ నెంబర్, పోలింగ్ స్టేషన్ సరైనదో లేదో పరిశీలించుకోవాలని తెలిపారు. ఓటర్లను ఐడి కార్డు ద్వారా గుర్తించాలని, ఎలాంటి సమస్యలు రాకుండా జాగ్రతగా పోలింగ్ నిర్వహించేలా ఉండాలని తెలిపారు. పోలింగ్ స్టేషన్ల నందు100శాతం వెబ్ కాస్టింగ్ ఉంటుందని తెలిపారు.సియు, బియు సమస్య వస్తే రీప్లేస్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. శిక్షణ కార్యక్రమంలో రిటర్నింగ్ అధికారి అపుర్వ చౌహాన్, శిక్షణ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలి-జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి-ఎన్నికల అధికారులు, సిబ్బందికి ఈవీఎంలపై అవగాహన ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES