జోగులాంబ గద్వాల జిల్లా ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి:- జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగే సాధారణ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. బుధవారం ఐడిఓసి కాన్ఫరెన్స్ హాలలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ గద్వాల, అలంపూర్ నియోజకవర్గాలలో నామినేషన్లు పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియ పూర్తయ్యిందని తెలిపారు. గద్వాల నియోజకవర్గంలో 20మంది అభ్యర్థులలో ఎవరు కూడా తమ నామినేషన్లను ఉప సంహరించుకోలేదని తెలిపారు. అలాగే అలంపూర్ నియోజకవర్గంలో18మంది అభ్యర్థులలో ఐదు మంది నామినేషన్లను ఉపసంహరించుకోగా, 13 మంది పోటీలో ఉన్నారని తెలిపారు. జిల్లాలో ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ఎస్ఎస్టి, ఎఫ్ఎస్టి, విఎస్టి టీములను ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికలలో కోడ్ ఉల్లంఘిస్తే అట్టి సమాచారాన్ని సి-విజిల్ ద్వారా చేరవేయవచ్చని తెలిపారు. ఫోటో గాని వీడియో గాని తీసి సి-విజిల్ యాప్ లో అప్లోడ్ చేస్తే100నిమిషాల్లోనే ఉల్లంఘనపై చర్యలు తీసుకుంటారని కలెక్టర్ తెలిపారు. అలాగే 1950 నంబర్ కి కాల్ చేయవచ్చని, ఓటర్ల సమాచారం కోసం నిరంతరం పనిచేస్తుందన్నారు. ఈ నెల 30న జరిగే పోలింగ్ ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు జరుగుతుందని, ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది వారి జన్మ హక్కు అని మహిళలు, యువతీ యువకులు, వృద్ధులు తప్పక వారి ఓటుని వినియోగించుకోవాలన్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం 171బి సెక్షన్ ద్వారా ఓటును డబ్బుకు కానీ ఇతర ప్రలోభాలతో కొనరాదని అలా చేస్తే సంవత్సరం జైలు శిక్ష, జరిమానా ఉంటుందన్నారు. సెక్షన్ 171సీ ద్వారా ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడం వల్ల వారికి శిక్ష తప్పదన్నారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన జరిగితే వెంటనే సి-విజిల్ ద్వారా ఎన్నికల సంఘానికి తెలపాలన్నారు. జిల్లాలో 2848మంది ఎన్నికల సిబ్బందిని నియమించడం జరిగిందని, ఇంకా వివిధ టీములలో వెయ్యిమందికి పైగా పనిచేస్తున్నారని తెలిపారు. గద్వాల నియోజకవర్గంలో 34 రూట్లకు 34మంది రూట్ ఆఫీసర్లు ఉన్నారని వారికి పోలీస్ వారు ఉంటారని తెలిపారు. అలంపూర్ నియోజకవర్గంలో 31రూట్లు ఉండి, 31మంది రూట్ అధికారులు ఉన్నారని తెలిపారు. 12మంది స్టాటిస్టిక్స్ అధికారులు చెకింగ్ పాయింట్ల దగ్గర ఉంటారని తెలిపారు. ఎక్కడైనా నగదు పట్టుపడితే నగదు గ్రీవెన్స్ కమిటీకి అప్పజెబుతారని, సరైన ఆధారాలు ఉంటే వాటిని తిరిగి ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ చీర్ల శ్రీనివాస్, డిపిఆర్ఓ చెన్నమ్మ తదితరులు ఉన్నారు.
సాధారణ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి-జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఓరుగల్లు9నేషనల్ టీవీ
RELATED ARTICLES