ఓరుగల్లు9నేషనల్ టీవీ ప్రతినిధి: నేరం చేసిన వారికి కఠిన శిక్షలు పడేలా కేసులు దర్యాప్తు చేయాలని డీజీపీ అంజనీకుమార్ అన్నారు. కోర్టుల్లో కేసులు వీగిపోకుండా సరైన సాక్ష్యాధారాలు సేకరించాలని ఆదేశించారు. శిక్షల శాతం పెరిగినప్పుడే నేరాలు తగ్గే అవకాశం ఉంటుందని సూచించారు. ప్రతి నెల నిర్వహించే క్రైమ్ రివ్యూలో భాగంగా నేరాలు,శిక్షలపై మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. సీఐడీ చీఫ్ మహేశ్భగవత్, ఐజీలు షానవాజ్ ఖాసీం, చంద్రశేఖర్ పాల్గొన్నారు.అన్ని జిల్లాల ఎస్పీలు, సీపీలు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు. ఆగస్టులో నమోదైన కేసుల వివరాలు, కోర్టుల తీర్పుల గురించి వివరించారు.
ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ..ఈ ఏడాది మొత్తం135 కేసుల్లో దోషులకు కోర్టులు జీవిత ఖైదు విధించాయని తెలిపారు. వీరిలో అత్యధికంగా రాచకొండ కమిషనరేట్ పరిధిలో 14 మందికి, సైబరాబాద్లో 13, సంగారెడ్డి జిల్లాలో 12, జగిత్యాలలో 10, హైదరాబాద్లో 9, నిజామాబాద్లో 9 మందికి జీవిత ఖైదు పడిందని వివరించారు. ఇన్వెస్టిగేషన్ అధికారులను డీజీపీ అభినందించారు.
రాష్ట్ర పోలీస్ అకాడమీలో సివిల్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్(ఎస్ఐ) ట్రైనింగ్ మంగళవారం నుంచి ప్రారంభమైంది.ఈ బ్యాచ్లో మొత్తం 414 మంది సివిల్ ఎస్ఐలు శిక్షణ పొందనున్నారు. 12 నెలల పాటు వీరికి ట్రైనింగ్ కొనసాగనుంది. శిక్షణ ప్రారంభోత్సవ కార్యక్రమంలో డీజీపీ అంజనీకుమార్ చీఫ్గెస్టుగా పాల్గొన్నారు